: చైనా నుంచి భారత్‌కు దిగుమతులపై.. కొత్త నిబంధనలు పెడుతూ మరో అడుగు ముందుకేస్తోన్న కేంద్ర సర్కారు

భార‌త వినియోగదారుడి ఫోన్‌ నెంబర్లు, మెసేజ్‌లతో పాటు ఇతర సమాచారాన్ని చైనా మొబైల్‌ కంపెనీలు తస్కరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటీవ‌లే ఆ దేశ మొబైల్ కంపెనీల‌కు భార‌త సర్కారు నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా కేంద్ర స‌ర్కారు మ‌రో ముంద‌డుగు వేసింది. భార‌త్‌లో విద్యుత్‌ రంగంలో చైనా ఉత్పత్తులను వాడటం వల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవ‌కాశం ఉండ‌డంతో వాటిపై దృష్టి సారించాల‌ని భార‌త వ్యాపారులు కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు.

మ‌రోవైపు భార‌త్‌లో చైనా వ‌స్తువులను నిషేధించాలంటూ డిమాండ్ కూడా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో చైనా సున్నిత‌మైన వ్యాపార రంగం పురోగ‌తిపై దృష్టిసారించింది. దీంతో కేంద్ర‌ స‌ర్కారు ఈ విషయాల‌పై కూడా స్పందించింది. విద్యుత్‌, టెలికం రంగంలో చైనా పెట్టుబడులు తగ్గించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఆ దేశం నుంచి దిగుమ‌తి అవుతోన్న విద్యుత్ ప‌రిక‌రాల‌ను అదుపుచేసేందుకు సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) కొత్త నిబంధనలను పొందుపరిచింది. ఇందుకు సంబంధించిన నివేదిక‌ను ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కారుకు పంపింది. దీన్ని కేంద్ర స‌ర్కారు ప‌రిశీలిస్తోంది. ఎలక్ట్రానిక్‌ ముడిపదార్థాల సరఫరా విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తే చైనా వ‌స్తువుల దిగుమ‌తిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని యోచిస్తోంది.

ఈ విష‌యంపై సీఈఏ ఛైర్మన్‌ ఆర్కే వర్మ మాట్లాడుతూ... భార‌త‌ విద్యుత్‌ రంగంలో ఇత‌ర‌ దేశాల పరికరాలను ఉపయోగిస్తే ఈ వ్య‌వ‌స్థ‌పై సైబర్‌ దాడి జరిగే అవకాశం ఉందని సందేహం వ్య‌క్తం చేశారు. కాగా, డోక్లాంలో నెల‌కొన్న ఉద్రిక్త‌ పరిస్థితుల నేప‌థ్యంలో ఇటీవ‌ల ఆ దేశ మీడియా ఓ క‌థ‌నంలో విద్యుత్‌ పెట్టుబడుల సహకారంపై నిషేధం విధిస్తే భార‌త్ న‌ష్ట‌పోతుంద‌ని రాసుకొచ్చిన విష‌యం తెలిసిందే. 

More Telugu News