: స్వస్థలానికి వచ్చిన అంబటి రాయుడు... సుదీర్ఘ విరామం తరువాత హైదరాబాదు జట్టుకు ప్రాతినిధ్యం!

టీమిండియాలో పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అంబటి రాయుడు సుదీర్ఘ కాలం తరువాత సొంత జట్టుకు ఆడనున్నాడు. మొయినుద్దౌలా గోల్ట్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీలో పాల్గొనే హెచ్సీఏ లెవెన్‌ జట్టుకు అంబటి రాయుడు సారథ్యం వహించనున్నాడు. ఈనెల 22 నుంచి 31 వరకూ టోర్నీ జరగనుంది. ప్రతిభ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లభించడం లేదని భావించిన అంబటి రాయుడు 2010లో హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) జట్టును వదిలి 2011లో బరోడా క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడేందుకు వెళ్లాడు. అనంతరం అక్కడి నుంచే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

అనంతరం టీమిండియాలో స్థానం సంపాదించాడు. ఆ క్రమంలో బరోడా జట్టు నుంచి 2016లో విదర్భ అసోసియేషన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా మళ్లీ హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ జట్టుతో మళ్లీ చేరాడు. ఈ నేపథ్యంలో హెచ్సీఏ లెవెన్ జట్టులో అంబటి రాయుడు (కెప్టెన్‌), సీవీ మిలింద్‌, అక్షత్‌ రెడ్డి, తన్మయ్‌ అగర్వాల్‌, రోహిత్‌ రాయుడు, ఠాకూర్‌ తిలక్‌ వర్మ, సందీప్‌, ఆశీష్‌ రెడ్డి, ఆకాశ్‌ భండారీ, మెహదీ హసన్‌, ఎండీ సిరాజ్‌, ఎం.రవికిరణ్‌, కె.సుమంత్‌, ఎండీ ముదస్సిర్‌, సాకేత్‌ సాయిరామ్‌, భగవత్‌ వర్మలను ఎంపిక చేశారు. 

More Telugu News