: కిమ్ జాంగ్ ఉన్ ను పొగిడేసిన డొనాల్డ్ ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వేషాన్ని కానీ, ప్రేమను కానీ మనసులో దాచుకోరు. ఏ భావోద్వేగాన్నైనా ట్విట్టర్ వేదికగా కక్కేస్తారు. అమెరికా అధ్యక్షపదవి చేపట్టిన నాటి నుంచి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పై ట్రంప్ కారాలు మిరియాలు నూరిన సంగతి తెలిసిందే. 'తెలివి తక్కువ వాడు' అంటూ కిమ్ పై నోరు పారేసుకున్నారు. ఎగస్ట్రాలు చేస్తే ఉత్తరకొరియాను బూడిద కుప్పగా మార్చేస్తానని గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, ఇప్పుడు ఒక్కసారిగా కిమ్ జాంగ్ ఉన్ పై ప్రశంసలు కురిపించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

దాని వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ప్రధాన పట్టణాలు తమ క్షిపణుల పరిధిలోకి వచ్చాయని, గువామ్ దీవిని బూడిద కుప్పగా మార్చి చూపిస్తానంటూ హెచ్చరించిన కిమ్ జాంగ్ ఉన్.. చైనా సూచనలతో ఆ దాడిని వాయిదా వేశారు. ఈ మేరకు కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ నిన్న ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో ఆయన ‘ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తెలివైన, బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యామ్నాయ నిర్ణయం విపత్తుకరమైన, ఆమోదయోగ్యం కానిది అయ్యుండేది’ అని ట్వీట్ చేశారు. 

More Telugu News