: ‘పెహ్రిదార్ పియా కి’ సీరియల్‌‌ను రాత్రి పదింటికి మాత్రమే ప్రసారం చేయాలి!: సోనీ టీవీకి ఆదేశాలు

బాల్య వివాహాలను ప్రోత్సహించేలా ఉన్న ‘పెహ్రిదార్ పియా కి’ సీరియల్‌ను రాత్రి పదిగంటల సమయంలో మాత్రమే ప్రసారం చేయాలని ప్రసార మాధ్యమాల సంబంధిత విషయాల ఫిర్యాదుల మండలి (బీసీసీసీ) సోనీ టీవీని ఆదేశించింది. గత నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ బాల్య వివాహాలను ప్రోత్సహించేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తొమ్మిదేళ్ల బాలుడు, 18 ఏళ్ల యువతిని పెళ్లాడాలనుకునే ఇతివృత్తంతో ఈ సీరియల్‌ను రూపొందించారు.

దీంతో ఈ ధారావాహికపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే నిషేధించాలంటూ ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ సీరియల్‌కు వ్యతిరేకంగా పెద్ద చర్చ జరిగింది. ‘చేంజ్.ఆర్గ్’ వెబ్‌సైట్‌లో ఉంచిన పిటిషన్‌పై లక్షమందికిపైగా సంతకాలు చేశారు. దీంతో తలొగ్గిన బీసీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటలకు బదులు పది గంటలకు ప్రసారం చేయాలని, అలాగే ఇదంతా కల్పితమని, బాల్య వివాహాలను ప్రోత్సహించడం లేదంటూ సీరియల్‌తోపాటే స్క్రోలింగ్ కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
 

More Telugu News