: చెన్నైలో తెలుగు టెక్కీ అదృశ్యం.. 13 నుంచి కనిపించకుండా పోయిన కావలి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్!

చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన కంచర్ల వెంకట సాయితేజ (24) అదృశ్యమయ్యాడు. ఈనెల 13న బైక్‌పై బీచ్‌కు వెళ్లిన అతడు మళ్లీ తిరిగి రూముకు చేరుకోలేదు. విషయం తెలిసిన సాయితేజ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా చెన్నైలో పనిచేస్తున్న సాయి ఈనెల 12న మరో స్నేహితుడి వద్దకు వెళ్లి 13న మధ్యాహ్నం రూముకు వచ్చాడు.

అనంతరం పర్స్, ఫోన్ రూములోనే పెట్టి బైక్‌పై బీచ్‌కు వెళ్లిన సాయి తిరిగి రూముకు చేరుకోలేదు. స్నేహితులు అతడి కోసం తీవ్రంగా గాలించగా బీచ్‌లో బైక్ కనిపించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసి, సాయి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చెన్నై చేరుకుని గాలించినా ఫలితం లేకపోవడంతో వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి కోసం గాలిస్తున్నారు.

More Telugu News