: యాక్సిడెంటులో మరణించిన ఎస్సైతో మహిళా కానిస్టేబుళ్లు కారులో ప్రయాణించిన కారణమిదే!

ఓ ఎస్సైతో పాటు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కారులో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందన్న విషయమై హైదరాబాద్ పోలీసులు వివరణ ఇచ్చారు. గత వారంలో ఎస్సై మహ్మద్ ఖలీల్ పాషాతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కీర్తి, మమత కారులో వెళుతుండగా, వారి వాహనం ఘోర ప్రమాదానికి గురి కాగా, ఈ ప్రమాదంలో ఖలీల్ తో పాటు కీర్తి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. మమత తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ రోడ్డు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం కాగా, శిక్షణలో ఉన్న మహిళలను ఎస్సై కారులో ఎందుకు తీసుకు వెళ్లాడన్న విషయమై పోలీసులు విచారణ జరిపారు. కానిస్టేబుల్ మమత కాల్ చేయడంతోనే ఖలీల్ పోలీస్ అకాడమీకి వచ్చాడని, మమతతో పాటు కీర్తిని తీసుకుని వారి ఇంటికి బయలుదేరాడని తెలిపారు. అంబర్ పేటలోని మమత ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగిందని తేల్చారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించామని అన్నారు. ప్రమాదానికి అరగంట ముందు ఆరె మైసమ్మ గుడి దగ్గర కారుకు ఇద్దరు యువకులు అడ్డుగా వచ్చారని సీసీ ఫుటేజీల సాయంతో విచారణ జరుపుతున్న అధికారులు గుర్తించారు. ఆ సమయంలో ఖలీల్ వారితో గొడవ పడ్డాడని తేల్చారు.

More Telugu News