: డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఒక్క ప్రముఖుడినీ వదిలేది లేదు: కేసీఆర్ హెచ్చరిక

తెలంగాణలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఏ ఒక్క ప్రముఖుడినీ వదిలేది లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న ఈ మహమ్మారిని కూకటివేళ్లతో సహా పెకిలిస్తానని ఆయన స్పష్టం చేశారు. గోల్కొండ కోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ఆయన, సినీ ప్రముఖులైనా, రాజకీయ నాయకులైనా, వ్యాపారులైనా మత్తుమందుల వాడకంలో నేరం నిరూపితమైతే చట్టం ముందు ఒకటేనని తెలిపారు.

 రాష్ట్రంలోని ప్రతి ఎకరా పొలానికీ నీరివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపిన ఆయన, అన్ని చెరువులనూ పునరుద్ధరిస్తామని అన్నారు. కోటి ఎకరాలకు నీరివ్వడమే తన కలని, దాన్ని సాకారం చేసేందుకు అందరు ప్రభుత్వ అధికారులూ కలసి రావాలని కోరారు. ఇటీవలే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునర్ వైభవాన్ని కల్పించేందుకు పనులు ప్రారంభించామని గుర్తు చేసిన కేసీఆర్, వచ్చే సంవత్సరం నుంచి రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నామని అన్నారు. ఎకరానికి రూ. 8 వేల చొప్పున రైతుకు అందిస్తామని తెలిపారు.

More Telugu News