: పిల్లలను ప్రేమించండి... గుడ్డిగా మాత్రం నమ్మకండి!: తల్లిదండ్రులకు 'రేమాండ్' బాస్ సింఘానియా సలహా

పుత్రరత్నాలను నమ్మి వారికి సర్వస్వమూ అప్పగించి, ఇప్పుడు కనీస నీడ లేక, కోర్టులో పోరాడుతున్న 'రేమాండ్' వ్యవస్థాపక అధినేత విజయ్ పథ్ సింఘానియా, తల్లిదండ్రులకు ఓ సలహా ఇచ్చారు. తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు రేమాండ్ లో రూ. 1000 కోట్ల విలువైన తన వాటానంతా ఇచ్చి, ఇప్పుడు తన జీవితం గడిచేందుకు అవస్థలు పడుతున్న ఆయన, "మీ పిల్లలను ప్రేమించండి. వారి ఆలనా పాలనా చూడండి. అయితే, గుడ్డిగా మాత్రం నమ్మవద్దు" అంటున్నారు.

తన 79 ఏళ్ల జీవితంలో, కుటుంబంలో విభేదాలను కోర్టు వరకూ తీసుకు వెళతానని ఎన్నడూ భావించలేదని అన్నారు. తనకున్నదంతా బిడ్డకు ఇచ్చేసి నిలువ నీడలేని వాడినయ్యానని, ఈ పరిస్థితి మరే తల్లిదండ్రులకూ రాకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, తన పోషణ నిమిత్తం నెలకు రూ. 7 లక్షలు ఇవ్వాలని విజయ్ పథ్ సింఘానియా కుమారుడిపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బాంబే హైకోర్టు గత వారంలో కోరింది. తండ్రిని గౌరవంగా చూసుకోవడం బాధ్యతని గౌతమ్ కు సూచించింది. కాగా, తానేం చేస్తున్నానన్న విషయంలో తనకు స్పష్టత ఉందని, తాను తప్పేమీ చేయడం లేదని గౌతమ్ సింఘానియా వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News