: హెచ్ 1బీ డ్రామాలో కొత్త ట్విస్ట్... భారత కంపెనీలపై దుమ్మెత్తి పోస్తున్న టెక్కీలు!

అమెరికా ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని భారత కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్వయంగా ఇండియన్ టెక్కీలే దుమ్మెత్తి పోశారు. వీసా విధానాన్ని వాడుకుంటూ కంపెనీలు తమ పబ్బం గడుపుకుంటున్నాయని, నిపుణులకు మాత్రమే దక్కాల్సిన ఉద్యోగాలు వారి దగ్గరకు చేరడం లేదని ఆరోపించారు. గత నెల 26వ తేదీన యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం (యూఎస్ సీఐఎస్) అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు 'నేషనల్ లిజనింగ్ సెషన్'ను నిర్వహించగా, పలువురు అమెరికన్ నిరుద్యోగులు, టెక్నాలజీ కంపెనీలు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సెషన్ లో ఎవరు ఏం మాట్లాడారన్న విషయాన్ని, వారి పేర్లను రహస్యంగా ఉంచాల్సి వుండగా, కొన్ని వివరాలు బహిర్గతమయ్యాయి.

వీసాలు యూఎస్ సీఐఎస్ నిబంధనలకు అనుగుణంగా జారీ చేయబడటం లేదని హెచ్-1బీ, ఎల్ వన్ వీసాలు అనర్హులకు దక్కుతున్నాయని ఓ వ్యక్తి ఆరోపించగా, వీసా ఫీజుల విషయం సహా, ఉద్యోగుల ఎంపికలో ఎంతో ఫ్రాడ్ జరుగుతోందని మరో ఉద్యోగి ఆరోపించారు. ఈ కార్యక్రమానికి 750 మంది వరకూ హాజరు కాగా, 30 మంది తమ అభిప్రాయాలను, తమకు ఎదురైన అనుభవాలను వివరించారు. కొన్ని ఇండియన్ కంపెనీలపై ప్రధానంగా ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు తెలుస్తోంది. కాగా, అమెరికాలో వేళ్లూనుకున్న యాంటీ - ఇండియన్ సెంటిమెంట్ కారణంగానే ఈ తరహా వ్యాఖ్యలు వచ్చాయని కొందరు అభిప్రాయపడటం గమనార్హం. ఈ కార్యక్రమంలో భారత కంపెనీలు, భారత్ నుంచి వచ్చి పనిచేస్తున్న హెచ్-1బీ ఉద్యోగులపైనే ఫిర్యాదులు అధికంగా వచ్చినట్టు, యూఎస్ లో ఇమిగ్రేషన్ సేవలందించేందుకు అనుమతులు పొందిన పూర్వీ చౌతానీ వ్యాఖ్యానించారు.

More Telugu News