: హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించని ఫలితం.. రోజుకు 43 మంది దుర్మరణం!

డ్రైవింగ్‌లో హెల్మెట్లు ధరించండి, సీటు బెల్టులు పెట్టుకోండి అని పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నప్పటికీ చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గతేడాది హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించకుండా ప్రయాణించిన వారిలో రోజుకు 43 మంది చొప్పున ప్రమాదాలకు గురై మృతి చెందారు. వీరిలో హెల్మెట్లు ధరించని 28 మంది ద్విచక్ర వాహనదారులు, 15 మంది సీటు బెల్టు ధరించని ఫోర్‌వీలర్ ప్రయాణికులు ఉన్నారు.  ఇదే ఏడాది రోజుకు 100 ప్రమాదాలు జరుగుతుండగా అందులో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

2005లో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ప్రతి వందమందిలో 21.6 మంది మరణించగా 2015 నాటికి అది 29.1 మందికి చేరుకుంది. కాగా, రవాణా, పోలీస్ శాఖలు తొలిసారి హెల్మెట్లు ధరించకుండా మృతి చెందిన వారి వివరాలు సేకరించాయి. ఈ మేరకు రాష్ట్రాలు కేంద్రానికి నివేదిక పంపాయి. ఇందులో ప్రతి ఐదుగురు బైకర్లలో ఒకరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా వారి మరణానికి కారణం హెల్మెట్ ధరించకపోవడమే అని తేలిందని తమ నివేదికలో పేర్కొన్నాయి. మొత్తంగా రోడ్డు ప్రమాదాల్లో 10,135 మృత్యువాత పడినట్టు వివరించాయి. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ 3,818 మరణాలతో తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాత 1,946 మందితో తమిళనాడు రెండో స్థానంలో, 1,113 మరణాలతో మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

మరోవైపు హిట్‌ అండ్ రన్ కేసులు కూడా పెరిగాయి. 2015లో హిట్‌ అండ్ రన్ కేసుల్లో 20,709 మంది మృతి చెందగా 2016లో ఆ సంఖ్య 22,962 మందికి చేరుకుంది. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో ఎక్కువ మంది యువతేనని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్‌కు చెందిన కేకే కాపిలా ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News