: బిగ్‌బీ అమితాబ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. పనామా పేపర్స్ కేసులో సూపర్‌స్టార్‌పై దృష్టి!

పనామా పేపర్స్‌లో పేరున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌పై ఆదాయపన్ను శాఖ దృష్టి కేంద్రీకరించింది. ఆయనతోపాటు అందులో పేర్లున్న మరికొందరి ‘పెద్దల’  వివరాలు సేకరిస్తోంది. ఇందుకోసం ఉన్నత స్థాయి అధికారులను బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌కు పంపింది. కరేబియన్  దీవి అయిన బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా మారిన ప్రాంతాలలో ఒకటి. పనామా పేపర్స్‌లో పేర్లు బయటకి వచ్చిన 33 మందిపై ఐటీ శాఖ ఇప్పటికే చర్యలకు ఉపక్రమించగా ఇతరులపై దర్యాప్తు ప్రారంభించింది. విచారణను ఆపే ప్రసక్తే లేదని, ఇతర దేశాల నుంచి ఇందుకు సంబంధించిన వివరాలను రాబడుతున్నట్టు ఓ అధికారి తెలిపారు.

కాగా, ఇదే కేసులో చిక్కుకుని నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు.  అమితాబ్ బచ్చన్‌పై వచ్చిన ఆరోపణలపై ఐటీ అధికారులు స్పందిస్తూ.. పనామా పేపర్స్‌లో ప్రస్తావించిన సంస్థలు తనవి కావని అమితాబ్ స్పష్టం చేశారని, ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మరింత సమాచారం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) సీనియర్ అధికారిని బ్రిటిష్ వర్జిన్‌కు పంపినట్టు తెలిపారు. అంతేకాక ఇతర దేశాల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిపారు. పనామా  పేపర్స్ వెల్లడించిన పేర్లలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే బచ్చన్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పడేశారు.  

More Telugu News