: జగన్ వల్లే వైసీపీ ఓటమిపాలవుతుంది : ఏపీ మంత్రి కళా వెంకట్రావు

జగన్ భాష, ప్రవర్తన కారణంగా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలు కానుందని ఏపీ మంత్రి కళా వెంకట్రావు జోస్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణస్వామిని ఈ రోజు ఆయన దర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో కళా వెంకట్రావు మాట్లాడుతూ, జగన్ ఎప్పటికీ నాయకుడు కాలేడని, అందుకు కారణం ఆయన ప్రవర్తన, మాటతీరు, బాడీ లాంగ్వేజ్, ఆయన చేసే పనులు, గతంలో జగన్ చేసిన అవినీతి పనులేనని అన్నారు.

 జైలు జీవితం గడిపినప్పటికీ జగన్ జీవితంలో ఎటువంటి మార్పు రాలేదని, పరివర్తన చెందలేదని, జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని అన్నారు. వైసీపీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు జగన్ ని అసహ్యించుకునే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పని చేసే వ్యక్తి జగన్ కాదని, నాడు తన తండ్రి నీడలో లక్ష కోట్లు దోచుకున్న జగన్ కు అధికారం వస్తే మరింత అవినీతికి పాల్పడతాడని ఆరోపించారు. ఈ ఉపఎన్నికలో జగన్ ని ఓడించేందుకు ప్రత్యేకమైన చర్యలు ఏవీ అక్కర్లేదని, ఆయన గురించి ప్రజలందరికీ తెలుసని, అభివృద్ధి మంత్రంతోనే నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

More Telugu News