: సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న ధావన్, రాహుల్

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ లు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. మ్యాచ్ జరుగుతున్న పల్లెకెలే అంతర్జాతీయ స్టేడియంలో అత్యధిక ఓపెనింగ్ పార్టనర్ షిప్ ను సాధించిన ఓపెనింగ్ జోడీగా ఘనతను సాధించారు. భారత స్కోరు 84 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ రికార్డు వారి సొంతమయింది.

దీనికితోడు, గత నాలుగేళ్లలో శ్రీలంకతో వంద అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రెండో ఓపెనింగ్ జోడీగా కూడా వీరు మరో ఘనతను సాధించారు. గత నాలుగేళ్లలో బంగ్లాదేశ్ ఓపెనర్లు సౌమ్యసర్కార్, తమీమ్ ఇక్బాల్ లు మాత్రమే శ్రీలంకలో 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మరోవైపు, తొలి సెషన్ లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భోజన విరామ సమయానికి భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 134 పరుగులు చేసింది. ధావన్ 64, రాహుల్ 67 పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్ లో ఐదుగురు బౌలింగ్ చేసినప్పటికీ భారత్ ఓపెనర్లపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 

More Telugu News