: డోక్లాం స్టాండాఫ్ నేపథ్యంలో సరిహద్దుకు మరిన్ని బలగాలు, ఆయుధాలు తరలిస్తోన్న భారత్!

భారత్-చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో భారత్ మరిన్ని బలగాలను తూర్పు సరిహద్దు వెంబడి మోహరిస్తోంది. శుక్రవారం మరిన్ని బలగాలతోపాటు ఆయుధాలను కూడా పెద్ద ఎత్తున తరలించింది. ఇరు దేశాల మధ్య గత రెండు నెలులుగా స్టాండాఫ్ కొనసాగుతుండగా ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు శుక్రవారం తొలిసారి భారత్-చైనాకు చెందిన మేజర్ జనరల్ ర్యాంకు అధికారుల మధ్య సిక్కింలోని నాథు లా బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బీపీఎం) పాయింట్ వద్ద అత్యున్నత స్థాయి ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. ఆగస్టు 8న ఇరు దేశాల బ్రిగేడ్ కమాండర్ల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో తాజా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

కాగా, చైనా సరిహద్దు వ్యాప్తంగా ఉన్న సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ‘ఆపరేషనల్ అలెర్ట్ ఏరియాల్లోకి’ భారత దళాలు కదులుతున్నాయి. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 4,057 కిలోమీటర్ల వ్యాప్తంగా భారత దళాలు ‘పూర్తి’ సిద్ధంగా ఉన్నాయి. శుక్రవారం భారత రక్షణ శాఖా మంత్రి లోక్‌సభలో మాట్లాడుతూ.. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మన రక్షణ దళాలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

More Telugu News