: అమిత్ షా వచ్చారు.. జాగ్రత్తగా ఉండండి: బీజేపీ ఎంపీలను హెచ్చరించిన మోదీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా ఆ పార్టీ ఎంపీలను ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇప్పడు షా వచ్చారని... అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పార్లమెంటు సమావేశాలకు డుమ్మా కొట్టవద్దని ఇప్పటికే హెచ్చరించనా, కొందరు ఎంపీలు ఇంకా తమ తీరును మార్చుకోలేదని... అలాంటి వారంతా అమిత్ రాకతో విశ్రాంతి రోజులు పూర్తయ్యాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఎంపీల హాజరును అమిత్ పర్యవేక్షిస్తారని చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారని ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రశ్నించారు. పార్టీనే హైకమాండ్ అని, మీరు కాని, నేను కాని పార్టీ ముందు ఏమీ కాదని అన్నారు. పార్లమెంటుకు గైర్హాజరవుతున్న ఎంపీలపై ఈ సందర్భంగా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీరు గైర్హాజరు కావడం వల్ల పార్లమెంటులో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు.

ఈ నెల ఆరంభంలో బీజేపీ రాజ్యసభ ఎంపీలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. విప్ జారీ చేస్తే తప్ప వీరు సభకు హాజరుకావడం లేదంటూ ఆయన మండిపడ్డారు. ఎంపీలంతా సభలో లేకపోవడంతో వెనుకబడిన తరగతులకు సంబంధించిన బిల్లు విషయంలో విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయని ఆయన అన్నారు.  

More Telugu News