: దొంగ‌ను పట్టిచ్చిన టాయిలెట్!

ఎంత తెలివైన దొంగైనా ఏదో ఒక త‌ప్పు చేస్తాడు. ఈ దొంగ కూడా అలాగే త‌ప్పు చేశాడు. దొంగత‌నం చేస్తున్న ఇంట్లో మ‌ల విస‌ర్జన చేసి, నీళ్లు పోయ‌కుండా వ‌దిలేశాడు. అంతే.. టాయ్‌లెట్‌లో దొరికిన మ‌లం నుంచి తీసిన డీఎన్ఏ, ఇంత‌కుముందే పోలీసుల ద‌గ్గ‌ర ఉన్న దొంగ‌ల డీఎన్ఏ డేటాబేస్‌లో ఒక‌దానితో స‌రిపోల‌డంతో దొంగ దొరికిపోయాడు. అమెరికాలోని లాస్ఏంజెలీస్‌లోని ఓ ఇంట్లో 2016 అక్టోబ‌ర్ నెల‌లో దొంగ‌త‌నం జ‌రిగింది. ఈ దొంగ‌త‌నానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొర‌క‌లేదు.

అయితే టాయ్‌లెట్‌లో నీళ్లు పోయ‌క‌పోవ‌డం వ‌ల్ల బేసిన్‌లో ఉన్న మ‌లాన్ని దొంగ‌కు సంబంధించిందిగా భావించి పోలీసులు దాన్ని ఆధారంగా సేక‌రించారు. ఆ శాంపిల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపి డీఎన్ఏ రిపోర్టులు తెప్పించారు. త‌ర్వాత ఆ డీఎన్ఏ వివ‌రాలు త‌మ ద‌గ్గ‌ర ఉన్న దొంగ‌ల డీఎన్ఏ డేటాబేస్‌తో స‌రిపోల్చారు. అదృష్ట‌వ‌శాత్తు ఒక దొంగ డీఎన్ఏతో మ‌లం డీఎన్ఏ మ్యాచ్ అయింది. దీని ఆధారంగా దొంగ‌తనం జ‌రిగిన ప్రాంతంలోనే నివ‌సించే ఆండ్రూ డేవిడ్ జెన్స‌న్స్ అనే 42 ఏళ్ల వ్య‌క్తిని అరెస్టు చేసి విచారించారు. విచార‌ణలో ఆండ్రూ నిజం ఒప్పుకోవ‌డంతో అత‌న్ని కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు.

More Telugu News