: భారత్ ను తీవ్రంగా హెచ్చరించిన చైనా గ్లోబల్ టైమ్స్!

డోక్లాంలో వివాదం రేగిన నాటి నుంచి చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ గొంతు చించుకుంటోంది. వివిధ అంశాలపై కధనాలతో భారత్‌ ను భయపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్ ఏమాత్రం దానిని పట్టించుకోకపోవడంతో అసహనంతో ఊగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాసిన కథనంలో భారత్ తో యుద్ధానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందని ప్రకటించిన గ్లోబల్‌ టైమ్స్‌...ఇప్పుడు డోక్లాంలో సైన్యాన్ని భారత్ వెనక్కి పిలవాలని, ఆలస్యమైన తరువాత సైన్యాన్ని వెనక్కి పిలిచినా ప్రయోజనం ఉండదని హెచ్చరించింది.

భారత్‌ ఊహల్లోంచి బయటకొచ్చి ప్రత్యక్ష ప్రపంచాన్ని కళ్లు తెరచి చూడాలని చెప్పింది. తమ పత్రికలో వస్తున్న వార్తలను భారత్ పట్టించుకోవడం లేదని, కళ్లు, చెవులు ఉన్నవారికి మాత్రమే తామిచ్చే సమాచారం చేరుతుందని సెటైర్ కూడా వేసింది. సమయం గడిచే కొద్దీ శాంతి మార్గం మూసుకుపోతుందని, తరువాత సైన్యాన్ని డోక్లాం నుంచి ఎందుకు ఉపసంహరించుకోలేదా? అని భారత్‌ బాధపడాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం దాని తాటాకు చప్పుళ్లను పట్టించుకోవడం లేదు. 

More Telugu News