: హైదరాబాదు డ్రగ్స్ ఘటనపై వివరాలేవీ లేవన్న కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్‌ లో పెను కలకలం రేపిన డ్రగ్స్‌ దందాపై తమ వద్ద వివరాలేవీ లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హైదరాబాదులో డ్రగ్స్ విక్రయం, సిట్ విచారణ, స్కూల్‌, కాలేజీ విద్యార్థులు, టెకీలను బానిసలుగా మార్చుతున్న అశంపై రాజ్యసభలో టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహీర్‌ సమాధానం చెబుతూ, తెలంగాణలో జరుగుతున్న డ్రగ్ దందాకు సంబంధించిన వివరాలేవీ తమ వద్ద లేవని అన్నారు.

అలాగే చికాగో నుంచి భారత్‌ కు నిషేధిత ఎల్‌ఎస్డీ, ఎండీఎంఏ డ్రగ్స్‌ అక్రమ రవాణా అవుతున్నట్టు నివేదికలేవీ తమవద్ద లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే డ్రగ్స్‌ నిర్మూలనకు 2005-12 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 79.43 లక్షల రూపాయలు ఇచ్చామని, అలాగే డ్రగ్ నియంత్రణకు యంత్రాంగాన్ని కూడా సమకూర్చుకోవాలని తెలిపామని ఆయన ప్రకటన చేశారు. అయితే ఇంకా డ్రగ్స్ నిర్మూలన యంత్రాంగం ఏర్పాటు చేసుకోలేదని ఆయన చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనకు కేంద్రం చిత్తశుద్ధిగా పని చేస్తోందని ఆయన తెలిపారు. 

More Telugu News