: ఉప ఎన్నికలు జరగకపోతే నంద్యాల‌కి చంద్రబాబు వ‌చ్చేవారా?: జ‌గ‌న్

నంద్యాల మండ‌లం రైతున‌గ‌రంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ రోజు ఆ పార్టీ రోడ్ షో నిర్వ‌హించింది. నంద్యాల ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డిని గెలిపించాల‌ని జ‌గ‌న్ కోరారు. నంద్యాల‌లో ఉప ఎన్నిక‌లు జరగకపోతే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ ప్రాంతంలో అడుగు కూడా పెట్ట‌క‌పోయేవార‌ని జ‌గ‌న్ అన్నారు. ఎన్నిక‌లు ఉన్నాయి కాబట్టి నంద్యాల అభివృద్ధి అంటూ ఇప్పుడు ఇక్క‌డికి వ‌స్తున్నార‌ని అన్నారు. నంద్యాల‌లో న్యాయానికి, అన్యాయానికి మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోందని ఆయ‌న అన్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన వాగ్దానాల‌ని చంద్రబాబు నాయుడు ఇప్ప‌టికీ నెర‌వేర్చ‌లేదని అన్నారు.

ఎన్నిక‌లు అయిపోయాక చంద్ర‌బాబు రైతులకు వెన్నుపోటు పొడిచాడని జగన్ అన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారని జాబులు కూడా రావ‌ట్లేవ‌ని జగన్ అన్నారు. సీఎం అయిన త‌రువాత ఆ హోదాలో 2014లో చంద్ర‌బాబు క‌ర్నూలుకి వ‌చ్చారని చెప్పారు. ఆ సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను కూడా నెర‌వేర్చ‌లేదని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడికి ఓ శాపం ఉంద‌ని, నిజాలు చెబితే ఆయన తల వెయ్యి ముక్క‌లు అవుతుంద‌ని ఆయ‌న అన్నారు. తాను మాత్రం ఎప్పుడూ అబద్ధాలు చెప్పబోనని అన్నారు. ప్ర‌జ‌లు ధ‌ర్మం, న్యాయం వైపు నిల‌బడాల‌ని వ్యాఖ్యానించారు.  

More Telugu News