: మనమెంతో అదృష్టవంతులం: లోక్ సభలో ప్రధాని స్ఫూర్తిదాయక ప్రసంగం

ఎంతో అదృష్టవంతులం కాబట్టే నూట పాతిక కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులుగా పవిత్రమైన పార్లమెంటులో కూర్చుని ఉన్నామని, వారి సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం లోక్ సభను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, స్వాతంత్ర్య ఉద్యమాన్ని, ఉద్యమ నేతలను స్మరించుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలై 75 సంవత్సరాలు గడిచాయని గుర్తు చేసిన ఆయన, ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.

 స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ సహా ఎందరో మహా పురుషులు జైలు జీవితం గడిపారని అన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటం క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన తరువాత అంతగా ఉద్ధృతమవుతుందని బ్రిటీష్ వారు కూడా ఊహించలేదని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఏకతాటిపైకి రాగా, వారిని ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరూ ఆదర్శనీయులేనని కొనియాడారు. గాంధీ పిలుపు చిన్నా, పెద్దలను ఏకం చేసిందని అన్నారు.

 జీవితంలో జరిగిన మంచి పరిణాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, అటువంటివే మళ్లీ మళ్లీ జరగాలని కోరుకోవాలని అన్నారు. తన జీవితంలో ఇప్పటికీ ఇంకా తృప్తిని పొందలేదని, ఈ విషయంలో గాంధీ చూపిన 'కరేంగే యా మరేంగే' (సాధిద్దాం లేదా మరణిద్దాం) బాట తనకు ఆదర్శమని అన్నారు. మోదీ ప్రసంగం స్ఫూర్తిమంతంగా సాగగా, ఆసాతం బీజేపీ ఎంపీలు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు.

More Telugu News