: మోదీ, అమిత్ లకు షాక్... అహ్మద్ పటేల్ ను గెలిపించిన బీజేపీ ఎమ్మెల్యే?

నిన్న రాత్రి నాటకీయ పరిణామాల మధ్య గుజరాత్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఖాళీ అయిన మూడు స్థానాల్లో ముగ్గురే పోటీ పడివుంటే, ఎన్నికలు లేకుండా ముగ్గురూ ఎన్నికై ఉండేవారే. కానీ, మూడింటిలోనూ పాగా వేయాలన్న ఎత్తుగడతో బీజేపీ మరో వ్యక్తిని పోటీకి నిలిపింది.
కాగా, ఇక్కడ మొత్తం 176 మందికి ఓట్లు ఉండగా, 45 ఓట్లు వచ్చిన వారి విజయం ఖాయమవుతుంది. ఓటు వేసిన వారిలో ఇద్దరు ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఓట్లను బయటకు చూపుతూ ఓటేసినందున వారి ఓట్లు చెల్లక పోవడంతో మ్యాజిక్ ఫిగర్ 44కు తగ్గింది. ఇదే కాంగ్రెస్ కు కలిసొచ్చిన తొలి అదృష్టం.

ఆపై పోలింగ్ సమయంలో కాంగ్రెస్ కు చెందిన 44 మందిలో 43 మంది అహ్మద్ పటేల్ కు ఓటేశారు. గెలుపుకోసం అవసరమైన ఆ 44వ ఓటు ఎవరు వేశారన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా అహ్మద్ పటేల్ ను ఓడించాలని చూసిన బీజేపీ అధినేతలు నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే నితిన్ భాయ్ పటేల్ షాకిచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఓటే అహ్మద్ ను సురక్షిత స్థానానికి చేర్చిందని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ మాత్రం జేడీయూ ఎమ్మెల్యే ఛోటూ భాయ్ లేదా ఎన్సీపీ లేదా జీపీపీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు తమకు ఓటేసి ఉండవచ్చని భావిస్తోంది.

More Telugu News