: రాజ్యసభ ఎన్నికల్లో క్షణ క్షణం ఉత్కంఠ.. అమిత్ షా, స్మృతి సునాయాస గెలుపు.. హైడ్రామా మధ్య గెలిచిన అహ్మద్ పటేల్!

రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరికి కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం సాధించారు. పటేల్ విజయంతో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంది. విజయం అనంతరం అహ్మద్ పటేల్ ట్వీట్ చేస్తూ ‘సత్యమేవ జయతే’ అని పేర్కొన్నారు. మంగళవారం గుజరాత్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికలు రాజకీయాల్లో వేడి పుట్టించాయి. దేశం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకున్నాయి. బుధవారం తెల్లవారుజాము వరకు హైడ్రామా కొనసాగింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరికి కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం సాధించారు. మరోవైపు బీజేపీ నుంచి పెద్దల సభకు పోటీ పడిన అమిత్ షా, స్మృతి ఇరానీలు సులభంగా విజయం సాధించారు. ఒక్క అహ్మద్ పటేల్ విషయంలోనే ఉత్కంఠ నెలకొంది.

తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో వారి ఓట్లను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో టెన్షన్ మొదలైంది. ఫిర్యాదు కారణంగా లెక్కింపు ప్రక్రియ ఆగిపోయింది. చివరికి కాంగ్రెస్ డిమాండ్‌తో దిగొచ్చిన ఈసీ అర్ధరాత్రి సమయంలో ఆ రెండు ఓట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు మొదలైనా రాత్రి 1.15 గంటల సమయంలో ఈసారి బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల ఓట్ల గోప్యత విషయంలో బీజేపీ అభ్యంతరాల కారణంగా లెక్కింపు ప్రక్రియకు మరోమారు అవరోధం కలిగింది. చివరికి 1.35 గంటలకు లెక్కింపు తిరిగి మొదలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన అమిత్ షా, స్మృతి ఇరాని విజయం సాధించగా ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్న బల్వంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన అహ్మద్ పటేల్ విజయం సాధించారు.


 

More Telugu News