: అమెరికాతో కలసి మరోసారి యుద్ధ విన్యాసాలకు సిద్దమవుతున్న భారత సైన్యం... గమనిస్తున్న చైనా!

భారత్ మరోసారి అమెరికాతో కలసి సంయుక్త ఆర్మీ విన్యాసాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్పటికే మలబార్ తీరంలో అమెరికా, జపాన్ సైన్యాలతో కలిపి విన్యాసాలు చేసిన ఇండియన్ ఆర్మీ ఈ సారి అమెరికాతో విన్యాసాలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 'యుద్ధ్ అభ్యాస్' పేరుతో సెప్టెంబర్ 14 నుంచి 27 వరకు ఈ సైనిక విన్యాసాలను అమెరికాలోని లూయిస్‌-మెక్‌ కోర్డ్ బేస్‌ లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ విన్యాసాల్లో గూర్ఖా రైఫిల్స్ కు చెందిన మెరికల్లాంటి 200 మంది సైనికులు పాలుపంచుకోనున్నారు.

కాగా, చైనా సరిహద్దుల్లో గూర్ఖా రైఫిల్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ద్వైపాక్షిక మిలట‌రీ విన్యాసాల‌తో వ్యూహాత్మ‌క రక్షణ భాగస్వామ్యాన్ని మ‌రింత ప‌టిష్ఠం చేసుకోవాల‌ని భారత్-అమెరికాలు భావిస్తున్నాయి. చైనా వివాదంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్న భారత్ కదలికలను ఆ దేశం నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే మలబార్ తీరంలో జరిపిన విన్యాసాలను గమనించిన చైనా, అమెరికన్ కాంగ్రెస్ లో ఆ దేశ రక్షణ, విదేశాంగ శాఖలు ఏషియా, ప‌సిఫిక్ ప్రాంతంలో ఇండియా త‌మ‌కు ముఖ్య‌మైన ర‌క్ష‌ణ భాగ‌స్వామి అంటూ చేసిన ప్రకటన నేపథ్యంలో భారత్-అమెరికా సైనిక విన్యాసాలను మరింత నిశితంగా గమినిస్తోంది. 

More Telugu News