: గూర్ఖాల్యాండ్ ఆందోళనల వెనుక చైనా హస్తం?

గత 55 రోజులుగా ప్రత్యేక గూర్ఖాల్యాండ్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు ధర్నాలు, బంద్, రాళ్ల దాడులు చేస్తూ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రాణం పోయినా రాష్ట్ర విభజనకు అంగీకరించనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గూర్ఖాల్యాండ్ కు ఆహారపదార్థాల సరఫరా కూడా నిలిచిపోయినా ఉద్యమం ఏమాత్రం చల్లబడలేదు. డార్జిలింగ్ స్పిరిట్ పేరుతో ఉద్యమం మరింత ఊపందుకుంటోంది. ఆందోళనకారులకు ఆహారం అందిస్తామన్న బీజేపీ హామీ నెరవేరలేదు.

ప్రభుత్వేతర సంస్థలు చేస్తున్న ఆహార సరఫరా గూర్ఖాయేతర కుటుంబాలకు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తే ఉద్యమం ఆగిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయని, అయితే ఆ భావన తప్పని గూర్ఖాల్యాండ్ ఉద్యమం నిరూపించింది. దీనికి కారణాన్ని నిఘా వర్గాలు వెల్లడించాయి. గూర్ఖాల్యాండ్ ఉద్యమానికి బయట శక్తుల మద్దతు లభిస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్న గూర్ఖా జనముక్తి మోర్చాకు చైనా నుంచి నిధులు అందుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం మూడు నివేదికలు సమర్పించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ లోని పలు ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలకు ఊతమిస్తున్న చైనా, వ్యూహాత్మకంగా పశ్చిమ బెంగాల్‌ ఆందోళనలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు శాటిలైట్ ఫోన్ల సాయంతో చైనా అధికారులతో మాట్లాడి నిధులు తెప్పించుకుంటున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 

More Telugu News