: టీడీపీ ఓటమి ఖరారు... నంద్యాలలో మేం గెలిచినట్టే: శిల్పా మోహన్ రెడ్డి

నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టేనని ఆ పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్న శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన నామినేషన్ ను ఆమోదిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ నుంచి ప్రకటన వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గంలో న్యాయమే గెలిచిందని అన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలతో టీడీపీ విష ప్రచారం చేసినా అవి విఫలమయ్యాయని తెలిపారు. స్వయంగా సీఎం చంద్రబాబు కుట్రలను ప్రోత్సహిస్తున్నారని, బూత్ ల వారీగా మంత్రులను నియమించి, ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ, కోట్లాది రూపాయలను గుమ్మరిస్తున్నారని ఆరోపించారు.

ఓటమి భయంతోనే తన నామినేషన్ ను తిరస్కరించడానికి కుట్రలు చేశారని ఆరోపించిన ఆయన, టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. ఎన్నికల నిబంధనల మేరకు తన నామినేషన్ ను అధికారులు ఆమోదించారని శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. ఇక అధికార టీడీపీ ఎన్ని ప్రలోభాలను పెట్టినా వైకాపాదే విజయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అభ్యంతరాల పేరుతో ఎంతో తప్పుడు ప్రచారాన్ని చేసి, చిన్న విషయాన్ని తమ అధీనంలోని ఎల్లో మీడియా ద్వారా ఎంతగా ప్రచారం చేయించినా, చివరకు న్యాయమే గెలిచిందని ఆయన అన్నారు.

More Telugu News