: సినీ పరిశ్రమ పరువు తీశారు: ఫిలిం ఛాంబర్ కు బహిరంగలేఖ రాసిన వర్మ

డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు చెందిన ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో డ్రగ్స్ ను అరికట్టడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని కొనియాడిన సినీ ప్రముఖులు... ఒకరిద్దరి వల్లనే పరిశ్రమకు చెడ్డ పేరు వచ్చిందని తెలిపారు. సినీ పరిశ్రమ, ఈ రంగంలోని వ్యక్తులు చాలా మంచి వారు అనే విధంగా వివరణాత్మకంగా లేఖ రాశారు. ఈ లేఖపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిప్పులు చెరిగారు. మీరు రాసిన లేఖతో సినీ పరిశ్రమ నిజంగా సిగ్గుపడుతోందని మండిపడ్డారు. డ్రగ్స్ స్కాండల్ వల్ల పరిశ్రమకు చెడ్డ పేరు రాలేదని... ఫిల్మ్ ఛాంబర్ రాసిన లేఖ వల్లే సినీ పరిశ్రమకు తలవంపులు వచ్చాయని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖను రాశారు. దాన్ని ఆయన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఆ లేఖ పూర్తి పాఠం...

"సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం డ్రగ్ స్కాండల్ కాదు... ఆ డ్రగ్ స్కాండల్ కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా, అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం. ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకు హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేశామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు చెప్పడం గాని ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు?

అపాలజీ లెటర్ లో ఒక వాక్యం"అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం"- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేశారో?

అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి... ఆల్రెడీ నేరం రుజువైందనే ధోరణిలో క్షమాపణ లేఖ పంపించడంలో అర్థం ఏమిటి?

అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం "మీలో ఏ మాత్రం పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసిక వేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా, జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగలేఖలు రాయాలి.

విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైనది కావచ్చేమో కానీ, అసలు చార్జెస్ కూడా ఫైల్ అవ్వని ఇలాంటి సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ వుంది.

ఒకవేళ అలా మాట్లాడడం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి, అన్యాయంగా కేసులు బనాయించి, చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం"

అలాగే రేపు ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ కి ఏ మాత్రం విచక్షణ వున్నా అధికారులకు బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లందరికీ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ చెప్పాలి.

ఇలా చెయ్యని పక్షంలో భావి చరిత్రలో వీళ్లందరూ నిజంగా నేరస్థులేనని... కాని ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణ మూలానే క్షమించి వదిలేసారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుంది. ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని గౌరవపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను."

More Telugu News