: ఆమిర్‌ఖాన్‌ దంపతులకు స్వైన్‌ఫ్లూ.. సత్యమేవ జయతే వాటర్ కప్ అవార్డ్స్‌కు దూరం!

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్, ఆయన సతీమణి కిరణ్‌రావులు స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించాడు. ఆదివారం  పుణెలో పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యమేవ జయతే వాటర్ కప్ అవార్డ్స్ ఫంక్షన్‌కు ఈ కారణంగానే హాజరుకాలేకపోయానని వివరణ ఇచ్చాడు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయినప్పటికీ తన స్నేహితుడు షారూక్‌ను పంపించాడు.

ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో తన బదులు కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మిత్రుడు షారూక్‌ను అడిగానని, అందుకు ఆయన అంగీకరించాడని ఆమిర్ పేర్కొన్నాడు. తనకు వచ్చిన స్వైన్‌ఫ్లూను ఇతరులకు అంటించి, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే ఫంక్షన్‌కు రాలేదని వివరించాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా, ఈ అవార్డ్స్ ఫంక్షన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, నీతా అంబానీ, రాజీవ్ బజాజ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఆమిర్‌కు వారం పాటు చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.

More Telugu News