: చైనా బాక్సర్‌ అలీని మట్టి కరిపించిన విజేందర్... డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్, ఓరియంటల్ టైటిల్స్ విజేతగా ఓటమెరుగని వీరుడు!

భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్ సింగ్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నాడు. శనివారం ముంబైలో జరిగిన బౌట్‌లో చైనా బాక్సర్ జుల్పికర్ మైమైతియాలిని మట్టికరిపించి డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. అంతేకాదు, డబ్ల్యూబీవో ఓరియంటల్  సూపర్ మిడ్ వెయిట్ టైటిల్‌ను కూడా చైనీస్ బాక్సర్ నుంచి చేజిక్కించుకున్నాడు.

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో విజేందర్ చివరికి విజయం సాధించి చాంపియన్‌గా అవతరించాడు. కాగా, విజేందర్ సింగ్ తాజా విజయం తన ప్రొపెషనల్ కెరీర్‌లో వరుసగా తొమ్మిదోది. బౌట్‌కు కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం జరగడంతో ఈ బౌట్‌పై అంచనాలు మిన్నంటాయి. మైమైతియాలిని ‘చైనా ప్రొడక్ట్’గా విజేందర్ అభివర్ణిస్తే, విజేందర్‌ను ఆయన ‘మీ ఇంటి కొచ్చి, మీ ప్రేక్షకుల ముందే నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తా’ అని శపథం చేశాడు.

More Telugu News