: ట్యాక్సులు ఎగ్గొట్టారన్న కాగ్ ఆరోపణలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్!

2015లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో నటించినందుకు లండన్‌ కు చెందిన వైబ్రంట్‌ విజువల్‌ లిమిటెడ్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ నుంచి 7.33 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడని, ఇందులో పన్నుగా చెల్లించాల్సిన 1.10 కోట్ల రూపాయలను ఎక్స్‌ పోర్ట్‌ ఆఫ్‌ సర్వీసుగా పరిగణించి పన్ను మినహాయింపునిచ్చారని కాగ్ తెలిపిందని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ కు షోకాజ్ నోటీసు ఇవ్వనున్నామని ఆర్థిక శాఖ అనుబంధ రెవెన్యూ విభాగం తెలిపిన సంగతి కూడా విదితమే. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చాడు.

ఆ వివరాల్లోకి వెళ్తే....పొరుగుదేశంలో నిర్మించిన చిత్రానికి భారత్ లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడంతోనే తాను నిర్మాతల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయలేదని అన్నాడు. దీనిపై 2016లో జరిగిన కాగ్ ఎంక్వయిరీలో ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తన ఆడిటర్లు తెలియజేయడం కూడా జరిగిందని తెలిపాడు. ఆ తరువాత దానికి సంబంధించిన నోటీసులు కానీ, ఇతర వివరాలేవీ తనకు అందలేదని ఆయన స్పష్టం చేశాడు. చాలా సంవత్సరాలుగా పన్నులు, సర్వీస్ ట్యాక్సులు క్రమబద్ధంగా చెల్లిస్తున్న వ్యక్తిని తానని ఆయన చెప్పాడు. భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను ఏనాడూ మరువలేదని ఆయన తెలిపాడు. ఈ విషయంలో సంబంధిత అధికారులతో నోటీసులు ఏవైనా అందితే అందులోని వివరాల ప్రకారం అణాపైసలతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించాడు. ఈ విషయంలో వివరాలు తెలియాల్సి ఉందని, చట్టానికి కట్టుబడి ఉండాలని నమ్మే వ్యక్తిని తానని, ఈ విషయంలో కూడా అలాగే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. 

More Telugu News