: "ఈ భూమిమీద బోల్ట్ ని ఓడించిన ఏకైక మగాడిని నేనే" అంటూ వీడియోను పోస్టు చేసిన డాషింగ్ బ్యాట్స్ మన్

'ఈ భూమి మీద ఉసేన్ బోల్ట్ ను ఓడించిన ఏకైక మగాడిని నేనే' అంటూ టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ దానికి సంబంధించిన వీడియో పోస్టు చేశాడు. ఒలింపిక్స్ లో 8 పతకాల విజేత, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రపంచం మొత్తం అతనికి అభినందనలు చెబుతోంది. నిన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు చెప్పగా, నేడు యువీ వంతు వచ్చింది. తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా బోల్ట్ కు శుభాకాంక్షలు చెప్పిన యువీ... ఈ భూగ్రహంపై బోల్ట్ ను ఓడించిన ఏకైక మగాడిని తానేనని పేర్కొన్నాడు.

కాగా, 2014లో ఓ కార్యక్రమం కోసం బోల్ట్‌ బెంగళూరు వచ్చాడు. స్వతహాగా క్రికెట్‌ పై వల్లమాలిన అభిమానం చూపే బోల్ట్ అదే కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ సింగ్ తో కలసి సరదాగా క్రికెట్ ఆడాడు. ఆ తరువాత వారిద్దరూ వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. ఆ పరుగులో ఉసేన్ బోల్ట్ ను వెనక్కు లాగేసి మరీ యువరాజ్ విజయం సాధించాడు. ఈ వీడియోను పోస్టు చేసిన యువీ ‘ఈ భూగ్రహంపై ఉసేన్‌ బోల్ట్‌ ని ఓడించగలిగింది నేనొక్కడినే. నువ్వు సాధించిన విజయాలను ఎవరూ అందుకోలేరు. ఆఖరి పోటీల్లో అద్భుతంగా రాణించు’ అంటూ శుభాకాంక్షలు చెప్పాడు. ఆ వీడియో మీరు కూడా చూడండి.

More Telugu News