: లక్ష్మాపూర్ గ్రామాన్ని లక్ష్మీదేవి తాండవించేలా చేస్తా: సీఎం కేసీఆర్

లక్ష్మాపూర్ గ్రామాన్ని లక్ష్మీదేవి తాండవించేలా చేస్తానని, ఈ గ్రామం రూపు రేఖలు మారుస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ శివారు, శామీర్ పేట మండలంలోని లక్ష్మాపూర్ లో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, లక్ష్మాపూర్ చెరువును గోదావరి జలాలతో నింపుతామని, గ్రామస్తులు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. చెరువు నిండిన తర్వాత కట్టపైకి తాను వస్తానని, దండిగా దావత్ చేసుకుందామని అన్నారు. ఈ గ్రామానికి రూ.15 కోట్లు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

కాగా, కేశవరం గ్రామానికి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ గ్రామంలో మౌలిక వసతుల కల్పన నిమిత్తం రూ.12 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్ తో సమానంగా మేడ్చల్ ను అభివృద్ధి చేస్తామని, గోదావరి జలాలతో కేశవరం చెరువులు నింపుతామని, నీళ్లు వదిలే రోజున తాను ఇక్కడికి వస్తానని, ఇకపై కరెంట్ కోతలు ఉండవని అన్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం శనివారం మధ్యాహ్నం కల్లా జీవోలు ఇస్తామని, ఆదివారం నుంచే పనులు ప్రారంభమవుతాయని కేసీఆర్ అన్నారు.

కేశవరంలో రూ. 75 లక్షలతో కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని, రూ. 30 లక్షల వ్యయంతో మహిళా వేదిక నిర్మిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్‌లో మార్పులు తీసుకువస్తామని ప్రకటించారు. పదిహేను రోజుల్లో కేశవరం రెవెన్యూ రికార్డులన్నీ మ్యుటేషన్ చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. నిజమైన రైతులను గుర్తిస్తే నేరుగా పథకాలు అందేలా చూస్తామని సీఎం చెప్పారు. 

More Telugu News