: దారుణం: రైల్వే ట్రాక్‌పై మహిళా హాకీ స్టార్ మృతదేహం.. ఆత్మహత్యా? హత్యా?

భారత జాతీయ మహిళా హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జ్యోతి గుప్తా (20) మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహం హరియాణాలోని రేవారి రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్‌పై కనిపించింది. జ్యోతి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చండీగఢ్-జైపూర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 8:30 గంటల సమయంలో రేవారి స్టేషన్ సమీపంలోకి రాగానే పట్టాలపై ఓ మహిళ అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది.

తాను బ్రేక్ వేసేందుకు ప్రయత్నించేలోపే రైలు ఆమెను ఢీకొందని రైలు డ్రైవర్ తెలిపారు. ఆ వెంటనే ఆయన రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. జ్యోతి చివరిసారి సాయంత్రం 7 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బస్సు ఆగిపోయిందని, ఇంటికి రావడం ఆలస్యమవుతుందని చెప్పింది. ఆ తర్వాత 10:30 గంటల సమయంలో కుటుంబ సభ్యులు జ్యోతికి ఫోన్ చేయగా దానిని రైల్వే పోలీసులు రిసీవ్ చేసుకుని జరిగిన ఘోరాన్ని వివరించారు.

గత నెలలో దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో పాల్గొనేందుకు జ్యోతి హిమాచల్‌ప్రదేశ్‌లోని షిలారూలో మూడు నెలలపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరైంది. బుధవారం ఉదయం  సోనెపట్ పారిశ్రామికవాడలో ఉన్న స్థానిక కోచింగ్ సెంటర్‌కు వెళ్లింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి పది, పన్నెండో తరగతి మార్కుల షీట్లలో కొన్ని కరెక్షన్లు ఉన్నాయని, కాబట్టి రోహ్‌తక్ వెళ్తున్నట్టు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News