: అమరావతా... భ్రమరావతా? అన్న ప్రశ్నకు లోకేష్ సమాధానం!

అమరావతి నగరాన్ని గ్రాఫిక్స్ లో మాహిష్మతిలా చూపించడం తప్ప ఇప్పటివరకూ జరిగిన నిర్మాణ కార్యక్రమాలు ఏమీ లేవని, అమరావతిని భ్రమరావతిగా చూపిస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై తెలుగుదేశం నేత, మంత్రి లోకేష్ ను ఓ టీవీ చానల్ ప్రశ్నించిన వేళ, ఆయన సమాధానం ఇచ్చారు.

"ఆనాడు ఇవే ప్రతిపక్షాలు... రాజశేఖరరెడ్డి... సైబర్ టవర్స్ ను నిర్మించిన వేళ ఇదే మాటన్నారు. సైబర్ టవర్స్ వల్ల ఏమొస్తుందని అడిగారు. అదే సైబర్ టవర్ వల్ల 20 ఏళ్లలో అన్ని ఐటీ కంపెనీలూ హైదరాబాద్ కు వచ్చి, ఐటీ రాజధానిగా మార్చివేశాయి" అని అన్నారు. హైదరాబాద్ లో 20 ఏళ్ల పాటు జరిగిన ఐటీ అభివృద్ధిని, అమరావతిలో ఐదేళ్లలో చూపాలన్న సదుద్దేశంతో ముందుకు సాగుతున్నామని, విపక్షాలకు అంత సమయం కూడా వేచిచూసే ఓపిక లేకనే విమర్శిస్తున్నారని అన్నారు. భూ సేకరణ ద్వారా 35 వేల ఎకరాలు తీసుకుని, మూడేళ్లలో కేవలం 10 ఎకరాల్లో మాత్రమే అభివృద్ధి చేశారని సదరు మీడియా ప్రతినిధి గుర్తు చేయగా, ఓ ఇల్లు కట్టాలంటేనే రెండేళ్లు పడుతుందని, రాజధానికి ఎంత సమయం పడుతుందో ఊహించుకోవాలని, నగర నిర్మాణం నిరంతర ప్రక్రియని అన్నారు.

More Telugu News