: పవన్ కల్యాణ్ కు, ముద్రగడకు పోలికా?... వైఎస్సార్సీపీ అధినేత సహా అంతా దొంగలే!: నారా లోకేష్

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడకు పోలికా? అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ముద్రగడకు పవన్ కల్యాణ్ తో చెక్ చెబుతున్నారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, పవన్ కల్యాణ్ చిత్తశుద్ధి గల వ్యక్తి అని అన్నారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిర్మాణాత్మకంగా పవన్ కల్యాణ్ పోరాడుతున్నారని ఆయన చెప్పారు. ఉద్దానం సమస్యను ఆయన తీసుకున్న విధానం, దాని పరిష్కారానికి కృషి చేస్తున్న విధానం చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుందని ఆయన చెప్పారు.

ఇక ముద్రగడ ప్రజల మధ్య చిచ్చురేపుతున్నారని, కులాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజల కోసం పాటుపడే పవన్ కల్యాణ్ తో ముద్రగడకు పోలికే లేదని ఆయన చెప్పారు. ముద్రగడను వెనుక నుంచి జగన్ నడిపిస్తున్నారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ చుట్టూ దొంగలే ఉన్నారని ఆయన చెప్పారు. మంచి వ్యక్తి చుట్టూ మంచి వ్యక్తులే ఉంటారని, ప్రజాధనం దోచుకున్న దొంగ చుట్టూ దొంగలే ఉంటారని ఆయన తెలిపారు. 

More Telugu News