: డామిట్ కథ్ అడ్డం తిరిగింది... సినిమాల అనుభవంతో వేసిన స్కెచ్ అట్టర్ ఫ్లాపైంది!

కుటుంబానికి దగ్గర కావడానికి తోడు తనకు అప్పులిచ్చిన ఫైనాన్షియర్లను బెదిరించేందుకు పక్కా ప్లాన్ చేసి, డబ్బులిచ్చి తనపైనే కాల్పులు జరిపించుకున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ 'డామిట్ కథ అడ్డం తిరిగింది' అని బాధపడుతున్నాడు. మంత్రి కుమారుడిగా దర్పం వెలగబెట్టిన విక్రమ్ గౌడ్ కు పలువుర్ని బెదిరించిన చరిత్ర ఉందని ఫిర్యాదులందుతున్నాయి. విక్రమ్ గౌడ్ కు సినిమాలంటే చాలా ఇష్టం. సినీ నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉండేవాడు. అయితే సినీ నిర్మాణం వద్దని కుటుంబ సభ్యులు చెబుతున్నా పట్టించుకునేవాడు కాదు. అలాగే మాదాపూర్ లో ఉన్న ఒక పబ్ లో భాగస్వామ్యం ఉంది. అంతే కాకుండా మైనింగ్ వ్యాపారంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో కుటుంబంతో విభేదాలు, వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి. దీంతో తెలిసిన వారి నుంచి అప్పులు చేశాడు. ఇంతలో హైదరాబాదు పబ్బుల్లో డ్రగ్స్ దందా అంటూ ఊహించని కష్టం వచ్చిపడింది. దీంతో ఫైనాన్షియర్లు డబ్బులెప్పుడిస్తావంటూ ఒత్తిడి చేశారు. కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నిర్మాణ భాగస్వామిగా సినిమా కథలు విన్న అనుభవంతో ఫుల్ స్కెచ్ ఆరు నెలల క్రితం వేశాడు. దాని గురించి తనజీవిత భాగస్వామికి కూడా చెప్పలేదు. తనతో పాటు ఉండే నందు అనే వ్యక్తికి దాని అమలు బాధ్యతలు అప్పగించాడు. నందు హైదరాబాదులోని షూటర్లను సంప్రదించాడు.

అయితే వారికి అనుభవం లేకపోవడంతో, తన పాత పరిచయాలతో అనంతపురంలోని షూటర్లను సంప్రదించాడు. వారు డీల్ కి అంగీకరించి, ఇండోర్ షూటర్లను రంగంలోకి దించారు. వారికి ప్లాన్ కూడా విక్రమ్ గౌడ్ వివరించాడు. దీంతో ప్లాన్ ప్రకారం విక్రమ్ గౌడ్ తన ఇంట్లోని సీసీ కెమెరాలు పని చేయకుండా జాగ్రత్త పడ్డాడు. మూడు రౌండ్ల కాల్పులు జరపాలని విక్రమ్ చెప్పినప్పటికీ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే భయపడి మూడో రౌండ్ కాల్చకుండానే పారిపోయాడు. అనంతరం విక్రమ్ స్కెచ్ వేసినట్టే, సూచించిన మార్గంలోనే పారిపోయారు. ఈ క్రమంలో షేక్ పేట చెరువులో తుపాకి పడేశారు.

అనంతరం విక్రమ్ అరవడం, షిపాలి రావడం, అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం చకచకా జరిగిపోయాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, తలుపు బయటివైపు నుంచి రంద్రాలు చేసుకుని వెళ్లాల్సిన తుపాకీ గుళ్లు లోపల వైపు నుంచి తలుపుకు దిగడంతో అనుమానించారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించి. ఛేదించారు. అనంతరం ఎ1గా విక్రమ్ గౌడ్, ఎ2 గా నందు, ఏ3గా అహ్మద్ ఖాన్, ఏ4 గా ఇండోర్  కు చెందిన షూటర్ రియాద్ తో పాటు మరో ఇద్దరు నిందితులపై 120,120 బి, 420, 404, 27 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. 

More Telugu News