: బీఎండబ్ల్యూ కారు మొరాయిస్తే, అద్దె కారులో విధులకు వెళ్లిన సౌరవ్ గంగూలీ

చిన్న కారైనా, పెద్ద కారైనా, అత్యంత ఖరీదైన లగ్జరీ కారైనా, నడిరోడ్డుపై మొరాయిస్తే దాన్ని పక్కన పెట్టాల్సిందే. ప్రయాణం కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సిందే. అదే పరిస్థితి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఎదురైంది. కోల్ కతాలో బీసీసీఐ సమావేశంలో పాల్గొనేందుకు తన బీఎండబ్ల్యూ కారులో గంగూలీ బయలుదేరగా, ఎక్సైడ్ క్రాసింగ్ సమీపంలో అది మొరాయించింది. ఇక్కడి లీ రోడ్ లో గంగూలీ కారు బ్రేక్ డౌన్ అయిందని, సమావేశానికి ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో ఆయన యల్లో టాక్సీని బుక్ చేసుకుని వెళ్లిపోయారని కారు డ్రైవర్ వెల్లడించాడు.

బీసీసీఐ సమావేశం ఓ ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ లో జరుగుతుండగా, టాక్సీ నుంచి దిగిన గంగూలీని చూసి అక్కడి వారు ఆశ్చర్య పోయారట. కాగా, ఇటీవల గంగూలీ పదాటిక్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న వేళ, ఆయనకు కేటాయించిన సీటునే మరో ప్రయాణికుడికి రైల్వే అధికారులు కేటాయించగా, దానిపై ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆపై ఫస్ట్ క్లాస్ బదులు సెకండ్ క్లాస్ లో గంగూలీ ప్రయాణించాల్సి వచ్చింది.

More Telugu News