: దేశంలోని ముస్లింలందరూ హిందువుల వారసులే.. బీజేపీ ఎంపీ హుకుమ్‌దేవ్ నారాయణ్

దేశంలోని మెజారిటీ ముస్లింలు హిందువుల వారసులేనని, కాబట్టి రెండు మతాల వారు పరస్పరం గౌరవించుకుని, ఒకరి మనోభావాలను మరొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలంటూ బీజేపీకి చెందిన మధుబని ఎంపీ హుకుమ్‌దేవ్ నారాయణ్ యాదవ్ సోమవారం లోక్‌సభకు తెలిపారు. ముస్లింలపై జరుగుతున్న దాడుల అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తిన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. దీంతో స్పందించిన ఎంపీ మాట్లాడుతూ.. ఇటువంటి ఘటలను ప్రధాని మోదీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యల గురించి మాట్లాడారు. వారిపై జరుగుతున్న దాడులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

కేంద్రాన్నిఅభాసుపాలు చేసేందుకు కొందరు రామాయణంలోని రాక్షసుల్లా ప్రవర్తిస్తుండగా, మరికొందరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య దశాబ్దాలుగా పోరాటం జరుగుతూనే ఉందన్నారు. అయితే ఎవరైతే అర్థిక ప్రగతి, జాతీయవాదంపై నడుస్తారో వారు విజయం సాధిస్తారని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్న మాటలను గుర్తు చేశారు. ‘‘దేశంలోని ముస్లింలందరూ హిందువుల వారసులే’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్క ముస్లిం హిందువుల మనోభావాలను గౌరవించాలని, అదే సమయంలో ప్రతి హిందువు ముస్లింల మనోభావాలకు తగిన గౌరవం ఇవ్వాలని కోరారు.

More Telugu News