: తనను కాల్చాలని స్వయంగా సుపారీ ఇచ్చిన విక్రమ్ గౌడ్?

తనను కాల్చాలని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ స్వయంగా సుపారీ ఇచ్చి వ్యక్తులను పురమాయించుకున్నాడా? పోలీసులు ఇదే నిజమై ఉండవచ్చన్న కోణంలో విచారణను ముమ్మరం చేశారు. కాల్పులకు ముందు అనంతపురంకు చెందిన ఓ వ్యక్తితో విక్రమ్ గౌడ్ మాట్లాడి వుండటం, ఇది ఆత్మహత్యాయత్నం కాదని ఆయన భార్య షిఫాలీ పోలీసులకు స్పష్టం చేసిన నేపథ్యంలో కేసును లోతుగా దర్యాఫ్తు చేస్తున్న పోలీసులకు కొన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లు కనిపించాయి.

విక్రమ్ ఇంటికి సమీపంలోని ఓ సీసీ కెమెరాలో బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళుతున్నట్టు రికార్డు కాగా, పోలీసులు దాన్ని పరిశీలించారు. ఆపై విక్రమ్ విచారణలో భాగంగా వెల్లడించిన విషయాలను విశ్లేషిస్తూ వెళ్లిన పోలీసులకు, కాల్పుల ఘటనపై విక్రమ్ వద్దే పూర్తి సమాచారం ఉందన్న నిర్ణయానికి వచ్చారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఆయన ప్రయత్నించాడన్న కోణంలో కేసును నమోదు చేశారు. ఆరోగ్యం మెరుగుపడే వరకూ అరెస్ట్ చేసేది లేదని చెబుతూనే, కేసును ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు పెరిగి వాటి నుంచి తప్పించుకునే క్రమంలో, ప్రాణాలు పోకుండా కాల్చాలని తానే స్వయంగా మనుషులను కుదుర్చుకున్నాడా? అనే కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News