: బట్టలూడదీశాడని తప్పుడు ఫిర్యాదు చేసిన సోదరుడి భార్య... పరువు పోయిందని పురుగుల మందు తాగిన రైతు!

తనను వివస్త్రను చేసి అవమానించాడంటూ స్వయంగా సోదరుడి భార్య ఫిర్యాదు చేయడంతో, గ్రామంలో పరువు పోయిందని భావించిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరుగగా, ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఏడెల్లి భూమిరెడ్డి, శ్రీనివాసరెడ్డి అన్నదమ్ములు. వీరి మధ్య పొలం తగాదాలు ఉన్నాయి.

తన భూమిని సాగు చేసేందుకు భూమిరెడ్డి వెళ్లిన వేళ, శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య సునీత అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో సునీత మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించి, తన బావ బట్టలూడదీశాడని, అవమానించాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయం గ్రామంలో తెలియడం, పలువురు అడగడంతో అవమానంతో కుంగిపోయిన భూమిరెడ్డి, పురుగుల మందు తాగాడు. దీన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు అతన్ని జమ్మికుంటలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

More Telugu News