: పవన్ కల్యాణ్ ప్లెక్సీ చించివేత... విజయవాడలో ఉద్రిక్తత!

నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్, విజయవాడకు వచ్చి, సీఎం చంద్రబాబునాయుడితో సమావేశం కానున్న వేళ, ఆయనకు స్వాగతం పలుకుతూ, అభిమానులు ఏర్పాటు చేసిన ప్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. భవానీపురం శివాలయం సెంటర్ లో మూడు రోజుల క్రితం ప్లెక్సీలను కట్టగా, వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకున్న పవన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

స్థానిక తెలుగుదేశం నాయకులకు విషయం వెల్లడించి, పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని వారు పరిశీలిస్తున్నారు. ప్లెక్సీలను చించేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, చంద్రబాబుతో సమావేశమయ్యే నిమిత్తం పవన్, విశాఖ నుంచి హార్వార్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లను తీసుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు సంబంధించి హార్వార్డ్ నిపుణులు వెల్లడించిన విషయాలను సీఎంకు తెలిపి, తీసుకోవాల్సిన చర్యలపై పవన్ చర్చించనున్నారు.

More Telugu News