: విమానాన్ని బాంబుతో పేల్చేయాలనుకున్న ఇస్లామిక్ ఉగ్రవాదులు.. భగ్నం చేసిన ఆస్ట్రేలియా పోలీసులు!

విమానాన్ని బాంబులతో పేల్చేందుకు ఇస్లామిక్ ఉగ్రవాదులు వేసిన ప్లాన్‌ను ఆస్ట్రేలియా కౌంటర్ టెర్రరిజం పోలీసులు శనివారం భగ్నం చేశారు. ఐదుగురు ఇస్లామిక్ ప్రేరేపిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిడ్నీకి చెందిన కొందరు అత్యాధునిక ఆయుధాలతో ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం తమకు అందిందని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ కమిషనర్ ఆండ్రూ కోల్విన్ తెలిపారు.

అయితే ఉగ్రవాదుల లక్ష్యం ఏవియేషన్ ఇండస్ట్రీనే అని తమ దర్యాప్తులో వెల్లడి కావడంతో అటువైపు దృష్టి సారించామని పేర్కొన్నారు. ఈ క్రమంలో శనివారం సర్రీ హిల్స్, లాకెంబా, పంచ్‌బౌల్, విలీ పార్క్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ఉగ్రవాదులు చిక్కినట్టు తెలిపారు. విమానంలో వారు బాంబు పేల్చేందుకు పథకం సిద్ధం చేశారని వివరించారు. కాగా, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరేందుకు ఆస్ట్రేలియా నుంచి సిరియాకు వందమందికిపైగా వెళ్లినట్టు స్వయంగా ఆస్ట్రేలియా మంత్రే చెప్పడం గమనార్హం.

More Telugu News