: దొంగల ముఠాకు చుక్కలు చూపిన గ్లాస్ కౌంటర్... రిక్తహస్తాలతో వెనుదిరిగిన చోరులు.. వీడియో చూడండి!

పక్కా ప్లాన్ తో దొంగతనానికి వచ్చిన వాళ్లు ఎటువంటి డోర్లనైనా బద్దలు కొట్టేస్తారు. అందుకు తగ్గా సామగ్రి వాళ్ల దగ్గర వుంటుంది. ఇక గ్లాస్ లాంటి అడ్డంకులైతే చెప్పేక్కర్లేదు. దెబ్బతో ఆ అద్దాలను రజను చేసి దూసుకుపోతారు. అయితే, ఓ జ్యుయెలరీ షాప్ లోని గ్లాస్ కౌంటర్ దగ్గర మాత్రం దొంగల పప్పులు ఉడకలేదు. ఆ వివరాల్లోకి వెళితే, మలేసియాలోని కేడై ఇమాస్ శ్రీ ఆలం జ్యూయేలేరీ షాపులోకి నలుగురు సభ్యులు గల దొంగల ముఠా ప్రవేశించింది. అక్కడి సెక్యూరిటీని తుపాకీతో బెదిరించి జ్యుయెలరీ షాప్ లోకి చొరబడింది. అక్కడ కౌంటర్ లో ఆభరణాలు చూసి తమ పంట పండిందని సంబరపడిపోయారు దొంగలు. వెంటనే కౌంటర్ ను బద్దలుగొట్టి ఆభరణాలు దొంగిలించేందుకు సమ్మెటలతో రంగంలోకి దిగారు. అయితే, సమ్మెటతో కౌంటర్ ను పగులగొట్టే ప్రయత్నం చేసిన దొంగల ముఠా షాక్ కు గురైంది.

బలంగా దెబ్బవేస్తుంటే భళ్లున పగలాల్సిన గాజు కౌంటర్... తనపై ఎలాంటి దెబ్బ పడనట్టు స్పదించలేదు. మళ్లీ మళ్లీ దెబ్బమీద దెబ్బ వేస్తుంటే, పైపొర పిండిగా మారిందే తప్ప కౌంటర్ మాత్రం పగలేదు. దీంతో వారు అవాక్కయ్యారు. తొందరగా పని ముగించుకుందామని భావించిన ముఠాకు ఆ గాజు కౌంటర్ చుక్కలు చూపడంతో అసహనంతో వారు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. అనంతరం సెక్యూరిటీ షాపు యజమానికి సమాచారం ఇచ్చింది. సీసీ టీవీ పుటేజ్ లో నమోదైన దృశ్యాలను చూసిన పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆ పాలీ కార్బనేట్ గ్లాస్ ను సదరు జ్యూయలెరీ షాపు ప్రత్యేకంగా తయారు చేయించిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో దీనిని పోస్టు చేయగా లక్షలాది వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ గ్లాస్ ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

More Telugu News