: ఇకపై దేశవ్యాప్తంగా కాంక్రీట్ రోడ్లు: నితిన్ గడ్కరీ

దేశంలోని రహదారులను కాంక్రీట్ రహదారులుగా మార్చడం జరుగుతుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇలా చేయడం వల్ల అవి దీర్ఘకాలం మన్నికగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నిన్న రాత్రి ముంబైలోని వాషిలో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ముంబైలో 20 ఏళ్ల క్రితం నిర్మించిన సిమెంట్ కాంక్రీటు రోడ్లు ఇప్పటికీ మంచి స్థితిలో ఉన్నాయి. కానీ, కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రం అలాంటి రోడ్లను ముంబైలో నిర్మించరాదని కోరుకుంటున్నారు’’ అంటూ విమర్శించారు. తరచుగా రోడ్ల నిర్మాణం జరిగితే ప్రయోజనం పొందొచ్చన్న ఆకాంక్ష వారిలో ఉన్నట్టు గడ్కరీ పరోక్షంగా చెప్పినట్టయింది.

వారు తరచుగా తారు రోడ్ల నిర్మాణం జరగాలని, సమయానికి వాటిపై గుంటలు పడాలని కోరుకుంటున్నారంటూ గడ్కరీ విమర్శించారు. దేశంలోని అన్ని రహదారులను సిమెంట్ కాంక్రీటు రూపంలోకి మార్చాల్సి ఉందన్న ఆయన అలా చేస్తే అవి 200 ఏళ్ల పాటు ఉంటాయని కచ్చితంగా చెప్పగలనన్నారు.

More Telugu News