: కూతురుని వేశ్యావాటికకు అమ్మేయాలని చూసిన తల్లి.. చాకచక్యంగా తప్పించుకున్న బాలిక!

కర్ణాటకలోని బీదర్ లో ప్రియుడి మత్తులో కన్న కూతుర్ని వేశ్యావాటికకు విక్రయించేందుకు పూనుకున్న తల్లి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక (17), వారిని పోలీసులకు పట్టించిన ఘటన చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... బీదర్ శివార్లలోని ఒక లే అవుట్ లో బాధిత బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. బాధిత బాలిక తల్లి ప్రవర్తనతో విసిగిపోయిన భర్త కొంత కాలం క్రితం ఆమెను విడిచి వెళ్లిపోయాడు. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఖాజామియాతో ఆమె వివాహేతర సంబంధం నెరపుతోంది. డబ్బుకోసం సంతానంలో పెద్దదైన బాలికను విక్రయించేందుకు ప్రియుడితో కలిసి ఆమె తల్లి నిర్ణయించుకుంది. కాలేజీ నుంచి ఇంటికి రాగానే 'పెళ్లి సంబంధం కుదిరింది, రాజస్థాన్ వెళ్లాలి, వెంటనే దుస్తులు మార్చుకుని తయారవ్వు' అంటూ వారిద్దరూ హుకూం జారీ చేశారు.

 దీంతో అన్నెం పున్నెం ఎరుగని బాలిక తయారవుతుండగా, ఖాజామియా ఫోన్ లో ఎవరితోనే 'బాలికను కాసేపట్లో తీసుకొస్తున్నాం, నా అకౌంట్లో 2 లక్షల రూపాయలు వెంటనే జమ చెయ్యు' అంటూ మాట్లాడడాన్ని వింది. వెంటనే అప్రమత్తమై పక్కింటి వాళ్ల సాయంతో ఆ బాలిక బంధువులకు సమాచారమందించి రమ్మని కోరింది. బంధువులు పోలీసులతో కలిసి వచ్చి వారి ఆటకట్టించారు. బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి, ఖాజామియాను అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News