: సత్తా చూపించిన నితీశ్ కుమార్... బల పరీక్షలో విజయం!

బీజేపీని బీహార్ లో గద్దెనెక్కుండా నిలువరించిన మహాఘటబంధన్ ను బద్దలు కొట్టి, అదే బీజేపీతో జతకట్టి, మరోసారి సీఎం పీఠంపై కూర్చున్న నితీశ్ కుమార్, అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. నిన్న ఆరవ విడత ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈ ఉదయం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచారు. స్పీకర్ బలపరీక్షకు అనుమతి నిస్తూ, డివిజన్ చేయాలని ప్రకటించిన సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ సభ్యులు ఈ ప్రభుత్వం అవినీతి మార్గంలో గద్దెనెక్కిందని తీవ్ర ఆరోపణలు చేశారు. నిరసనల మధ్యే ఓటింగ్ ను నిర్వహించిన స్పీకర్ బలపరీక్షలో నితీశ్ కు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 108 ఓట్లు వచ్చాయని ప్రకటించారు. బలపరీక్షలో నితీశ్ గెలిచారని చెబుతూ, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఓటింగ్ అనంతరం బయటకు వచ్చిన ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నిరసనను తెలుపుతూ అసెంబ్లీ ఎదుట బైఠాయించారు.

More Telugu News