: సిట్ ముందుకు నిన్న ఛార్మీ, నేడు ముమైత్ ఖాన్, రేపు రవితేజ

సిట్ ముందు నిన్న జ్యోతిలక్ష్మి (ఛార్మీ కౌర్), నేడు మైసమ్మ (ముమైత్ ఖాన్) విచారణ పూర్తికాగా, రేపు మాస్ మహారాజా రవితేజ విచారణ జరగనుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ అనంతరం చేతి, కాలి గోళ్లతో పాటు తల వెంట్రుకలు సేకరించిన సిట్ అధికారులు, తరువాత శ్యామ్ కే నాయుడు, తరుణ్ నుంచి కూడా సేకరించారు. చిన్నా తనకు అలవాటు లేదని చెబుతూ, పలు వివరాలు చెప్పడంతో అతని నుంచి ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. నవదీప్ పలు వివరాలు అందించినా, గోళ్లు, వెంట్రుకల సేకరణకు అంగీకరించకపోవడంతో అతని నుంచి కూడా అవి తీసుకోలేదు. సిట్ కు రక్తనమూనాలతో సహా ఏవీ ఇచ్చేది లేదని హైకోర్టులో పోరాడి సాధించిన ఛార్మీ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇక ముమైత్ కూడా ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే వెనుదిరిగినట్టు తెలుస్తోంది. అంతకు ముందు విచారణ అనంతరం పలు వివరాలు వెల్లడిస్తూ పలు కథనాలు వెల్లువెత్తిన నేపథ్యంలో, జ్యోతిలక్ష్మి, మైసమ్మ విచారణ అనంతరం ఎలాంటి లీకులు లేకుండా సిట్ అధికారులు జాగ్రత్త వహించారు. ఈ నేపథ్యంలో రేపు రవితేజను సిట్ విచారించనుంది. అయితే ఇప్పటికే రవితేజకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో పరీక్షలకు సహకరిస్తాడా? లేదా?, అతనిని సిట్  ఏరకంగా విచారించనుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 

More Telugu News