: అడవిలో దారితప్పిన తెలంగాణ మంత్రి

తెలంగాణ అటవీ మంత్రి జోగు రామన్న నర్సాపూర్ - హైదరాబాద్ మధ్య పరుపు మండ సమీపంలోని దట్టమైన అడవిలో దారి తప్పడంతో కాసేపు ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో చేపట్టిన హరితహారంలో పాల్గొనేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కలెక్టర్ భారతీ హోలికేరి తదితరులు ఈ ప్రాంతానికి వచ్చారు. ప్రధాన రహదారి నుంచి మొక్కలు నాటే స్థలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా, వారంతా నడుస్తూనే వచ్చారు. మొక్కలు నాటిన తరువాత అడవిలోనే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన భోజనాల కోసం బయలుదేరారు. అందరూ ముచ్చటించుకుంటూ దారి తప్పి మరో మూడు కిలోమీటర్ల దూరం వెళ్లిపోయారు. వీరు ఎంత సేపటికీ రాకపోయేసరికి, పోలీసులు ఆఘమేఘాల మీద అడవిలోకి వెళ్లి, వారిని గుర్తించి తిరిగి వెనక్కు తీసుకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News