: ఇక నోటీసులు వద్దని రంగంలోకి దిగిన నిర్మాత, హీరో... మెత్తబడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం!

తొలి జాబితాలో భాగంగా 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి, వారందరినీ విచారిస్తున్న సిట్ అధికారులు, రెండో జాబితాలో ఓ అగ్రనిర్మాత కుమారులతో పాటు, మరో హీరో, హీరోయిన్లు, సాంకేతిక నిపుణుల పేర్లను సేకరించి వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతున్న వేళ, సినీ పెద్దలు రంగంలోకి దిగారు. ఇప్పటికే కుదేలైన సినీ పరిశ్రమ రెండో జాబితా నోటీసులతో మరింత దిగజారుతుందని, పరిశ్రమ మనోస్ధైర్యం దెబ్బతింటుందని ప్రభుత్వ పెద్దలతో వీరు చర్చించినట్టు తెలుస్తోంది.

ఓ బడా నిర్మాతతో పాటు, గతంలో హీరోగా, ఇప్పుడు విలన్ గా వైవిధ్యమైన పాత్రలు ధరించి మెప్పిస్తున్న నటుడు పరిశ్రమ తరఫున ప్రభుత్వంతో రాయబారం నడపగా, టీఆర్ఎస్ సర్కారు మెత్తబడినట్టు సమాచారం. విచారణ కొనసాగినా, అనవసర ప్రచారాన్ని ఆపాలని, ఒకరిద్దరి తప్పుల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమను ఊబిలోకి నెట్టవద్దని వారు కోరగా, వెంటనే ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి కొన్ని ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరింత మందికి నోటీసులు వెళ్తాయా? లేదా? అన్నది అనుమానాస్పదమే.

More Telugu News