: వ్యాపారిని ఎత్తుకెళ్లి 100 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

వ్యాపారిని ఎత్తుకెళ్లిపోయి 100 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన కిడ్నాప్ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన సంజీవ్ గుప్తా అనే వ్యాపారవేత్త శనివారం రాత్రి డిన్నర్ కు ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. అనంతరం ఇంటికి రాలేదు. రాత్రంతా అతని కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో అతని కుటుంబ సభ్యులందరి మొబైల్ ఫోన్లకు సంజీవ్ ను కిడ్నాప్ చేశామని, 100 కోట్ల రూపాయలు ఇస్తేనే అతనిని విడిచిపెడతామంటూ మెసేజ్ వచ్చింది.

ఈ విషయం పోలీసులకు చెబితే సంజీవ్ ను చంపేస్తామని హెచ్చరించారు. అయితే అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు ఈ మెసేజ్ లను పోలీసులకు చూపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి సంజీవ్‌ కోసం గాలింపు చేపడుతున్నారు. ఈ క్రమంలో సంజీవ్‌ కారు అలీఘడ్‌ లో గుర్తించారు. సంజీవ్ ను వీలైనంత త్వరగా కిడ్నాపర్ల చెర నుంచి విడిపిస్తామని వారు తెలిపారు. 

More Telugu News