: 34 ఏళ్లుగా వ‌ర్షం రాక‌ను క‌చ్చితంగా క‌నిపెట్టేస్తున్న కేర‌ళ వ్య‌క్తి!

కేర‌ళ‌లోని వ‌య‌నాడు ప్రాంతానికి చెందిన విమ‌ల్ కుమార్‌ 30 ఎక‌రాల కాఫీ తోట య‌జ‌మాని. కాఫీ తోట‌ల పెంప‌కంలో వ‌ర్షం పాత్ర చాలా కీల‌క‌మైంది. వ‌ర్షం జాడ తెలుసుకోవ‌డానికి భార‌త వాతావ‌ర‌ణ కేంద్ర స‌హాయం మీద ఆధార‌ప‌డ‌కుండా తానే స్వ‌యంగా వ‌ర్షం జాడ కోసం ఓ ప‌రిక‌రం క‌నిపెట్టాడు విమ‌ల్‌. ఈ ప‌రిక‌రం ద్వారా కొన్ని సార్లు వాతావ‌ర‌ణ శాఖ‌కే విమ‌ల్‌ మార్గ‌ద‌ర్శ‌కం చేశాడు. కేవ‌లం ఒక ప‌రీక్ష‌నాళిక‌తో త‌యారు చేసిన రెయిన్‌గేజ్‌ను ఉప‌యోగించి 34 ఏళ్లుగా వ‌ర్షం రాక‌ను క‌చ్చితంగా క‌నిపెట్టేస్తున్నాడు విమ‌ల్‌.

సంవత్స‌రాంతం త‌డిగానే ఉండే వ‌య‌నాడులోని ముట్టిల్ ప్రాంతంలో విమ‌ల్ నివ‌సిస్తున్నాడు. ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల‌కే త‌న రెయిన్‌గేజ్ రీడింగ్స్‌ను బుక్‌లో రాసుకుంటాడు. వాటి ఆధారంగా వ‌ర్షం తీవ్ర‌త‌ను, స్థాయిని గుర్తించి తోటి కాఫీ రైతుల‌కు చెబుతుంటాడు. ఆయ‌న చెప్పిన విష‌యం గ‌త 34 ఏళ్ల‌లో ఏ రోజు కూడా త‌ప్పు కాలేద‌ని అక్క‌డి రైతులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వయ‌నాడు ప్రాంతంలో నాలుగు వాతావ‌ర‌ణ శాఖ మానిట‌రింగ్ సెంట‌ర్లు ఉన్నా, వాటి అంచ‌నా క‌న్నా విమ‌ల్ అంచ‌నాలే స‌రిగ్గా ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు.

More Telugu News